రూ.1.1 కోట్ల విలువైన 220 కిలోల గంజాయి స్వాధీనం.ముగ్గురు అరెస్ట్.. ఇద్దరు కార్లు సీజ్
🗞️ బిబి న్యూస్ | 16 Jul 2026
అనకాపల్లి, జూలై 16: అనకాపల్లి జిల్లా పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి రూ.1.1 కోట్ల విలువైన 220 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, గంజాయి రవాణాకు ఉపయోగించిన రెండు లగ్జరీ కార్లను సీజ్ చేశారు.అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అనకాపల్లి సబ్ డివిజన్ ఇంచార్జి డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్ ఆదేశాల మేరకు, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు పర్యవేక్షణలో రావికమతం పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు.జూలై 15న మధ్యాహ్నం రావికమతం–అనకాపల్లి రహదారిలోని గుడివాడ జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన రెండు కార్లను తనిఖీ చేశారు. వాటిలో అక్రమంగా తరలిస్తున్న 220 కిలోల గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.1.1 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.సీజ్ చేసిన వాహనాలు మారుతి ఎర్టిగా (AP40 JP 6216), టాటా కర్వ్ (AP40 LM 1517).ఈ కేసులో కిల్లో తిమోతి (26), షేక్ మహమ్మద్ రఫీ (26), షేక్ ఫయాజ్ (19)లను అరెస్ట్ చేశారు. పోలీసుల తనిఖీల సమయంలో మరో ముగ్గురు వ్యక్తులు, మోటార్ సైకిల్పై పైలటింగ్ చేస్తున్న మరో ఇద్దరు నిందితులు పరారయ్యారు.విచారణలో ఏఎస్సార్ జిల్లా పెదబయలు ప్రాంతానికి చెందిన కిల్లో తిమోతి గంజాయి సరఫరాదారుగా వ్యవహరిస్తుండగా, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ కొనుగోలుదారుడిగా ఉన్నట్లు గుర్తించారు. గతంలో కూడా 50 కిలోల గంజాయిని కొనుగోలు చేసి తమిళనాడులోని హోసూర్కు చెందిన సౌందర్కు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది.తాజాగా జూలై 14న 220 కిలోల గంజాయిని రూ.1.50 లక్షల అడ్వాన్స్ చెల్లించి కొనుగోలు చేసి, హోసూర్కు తరలిస్తుండగా రావికమతం పోలీసులు గుడివాడ జంక్షన్ వద్ద పట్టుకున్నారు.ఈ ఘటనపై రావికమతం పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 52/2026గా నమోదు చేసి, NDPS చట్టంలోని సెక్షన్ 20(b), 25 r/w 8(C) కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితులు, హోసూర్కు చెందిన గంజాయి రిసీవర్ సౌందర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి.భారీ గంజాయి రవాణా ముఠాను పట్టుకోవడంలో సమయస్ఫూర్తితో వ్యవహరించిన రావికమతం ఎస్సై ఎం.రఘువర్మ, బుచ్చయ్యపేట ఎస్సై పి.మనోజ్ కుమార్తో పాటు పోలీసు సిబ్బందిని డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్ అభినందించి నగదు రివార్డులు అందజేశారు.